పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి,అత్యధిక బకాయిలు ఉన్న వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయి రూ.1355.07 లక్షలు, ఎరియర్స్ రూ.572.53 లక్షలు,ప్రస్తుత మొత్తం బకాయి రూ.782.54 లక్షలకు రూ.699.80 లక్షలు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,పట్టణ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, అందరూ తమ ఆస్తి పన్నులను మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.100 శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్,బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు.బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం,ఇంకా చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘ చట్టం – 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.ఈ తనిఖీ సమయంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.