ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటి కి సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి యూ సి మొదటి రెండు సంవత్సరాలు, ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ ఊహించని రీతిలో యాజమాన్యం సెలవులు ప్రకటించటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో సెలవుల ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ట్రిపుల్ ఐటీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, విచారణ చేపట్టాలని కోరుతూ విద్యార్థులు అధికారులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో విద్యార్థుల జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. క్యాంపస్ విషయాలు బయటకు వస్తే చర్యలుంటాయని విద్యార్థులను అంతర్గతంగా హెచ్చరిస్తున్న క్రమంలో క్యాంపస్ విషయాలు బయటకు రావటం లేదు. అధికారులు సైతం అన్ని రకాలుగా విద్యార్థులను బెదిరిస్తున్నారని పేరు వెల్లడించని విద్యార్థి ఒకరు వివరించారు. ప్రభుత్వ పరంగా క్యాంపస్ లో జరుగుతున్న అంతర్గత విభేదాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.