Take a fresh look at your lifestyle.

గత ప్రభుత్వాల కాలంలో ఆలయాన్ని పట్టించుకోని పాలకులు.. : మంత్రి అడ్లూరి

అందరి సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలు..

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర న్యూస్ , ధర్మపురి:

గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవిందుల హరి తో కలిసి మంత్రి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇందులో భాగంగా గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని మంత్రి వివరించారు.

గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మాస్టర్ ప్లాన్, టెంపుల్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారని మంత్రి వివరించారు. బాసరలోని సరస్వతి అమ్మవారు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులకు ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ తోపాటు పలువురు అధికారులు కలిసి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి వివరించారు.

ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రజల నుంచి సహకారం కావాలని మంత్రి కోరారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులు చేస్తామని మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.