ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో నలుగురు సభ్యులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొదటగా ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన కేటగిరీకి సంబంధించి వచ్చిన మూడు దరఖాస్తులను పరిశీలించగా, నిబంధనల ప్రకారం ఒక మహిళా సభ్యురాలితో కలిపి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి పల్లెర్ల యాదగిరి, బడుగు విజయలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అల్పసంఖ్యాక వర్గాల కేటగిరీలో వచ్చిన 8 దరఖాస్తుల నుండి సుజాయత్ అలి కౌసర్, బట్టు వరలక్ష్మిలను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే ఓటు హక్కుతో కలిపి మొత్తం 26 మంది సభ్యులు చేతులెత్తి ఈ ఎన్నికకు మద్దతు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఎమ్మెల్యే, చైర్పర్సన్ వారికి డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.