మహాదేవపూర్, ముద్ర:
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రైతు భరోసా నిధుల మంజూరు కార్యక్రమాన్ని మన జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ప్రారంభించనున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, సభ ఏర్పాటులో అసౌకర్యాలకు తావుండకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ఐడిఓసి కార్యాలయంలో సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మేడిగడ్డ, కాళేశ్వరం దేవస్థాన ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనతో పాటు, కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా నిధుల మంజూరు కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాలకృష్ణవివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.