బీబీనగర్, ముద్ర విలేకరి: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) వరంగల్ కు చెందిన ఒక డైరెక్టర్ తో పాటు, మరో ప్రైవేటు వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజాకు సమీపంలోని ఒక రెస్టారెంట్ ప్రతినిధి నుంచి రూ.60,000 లంచం తీసుకుంటుండగా ఎన్ హెచ్ఏఐ డైరెక్టర్ తో పాటు మధ్యవర్తిత్వం నెరపిన మరో ప్రైవేటు వ్యక్తిని మంగళవారం అధికారులు అరెస్టు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని వున్న ఈ రెస్టారెంట్ కు జాతీయ రహదారుల విభాగం అధికారుల నుంచి ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను సంబంధిత అధికారి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. చివరికి వారి మధ్య 60 వేల రూపాయలు ఇవ్వడానికి మధ్యవర్తి ద్వారా అంగీకారం కుదిరింది. తాను సర్వీసులో వుండే అయిదేళ్ల పాటు ఈ రెస్టారెంట్ విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోనని సంబంధిత యజమానికి డైరెక్టర్ హామీ ఇచ్చారు. అయితే, ఈ విషయమై సీబీఐ అధికారులకు అందిన సమాచారం మేరకు వ్యూహాత్మకంగా వారు పన్నిన వలలో ఆ డైరెక్టర్ తో పాటు, అతనికి సహకరించిన ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో వుంది.