- 35వ వార్డులో అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమంగా కాక, ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి అని మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హన్మంతరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక 35వ వార్డులో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.వర్షాకాలం నేపథ్యంలో నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమల ఉత్పత్తిని అడ్డుకోవడం అత్యవసరమని ఆయన సూచించారు.నిలిచిన నీటిని తొలగించడంలో, తాగునీటి భద్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు.తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అప్పగించడం ద్వారా సమర్ధవంతమైన ముడిసమాచార నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపారు. వీధుల్లో సంచరించే మూక కుక్కల నియంత్రణకు టీకాలు, బెల్టులు తప్పనిసరి అని, పెంపుడు జంతువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.శిధిల భవనాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, ప్రమాదాలను ముందుగానే నివారించుకోవాలని కమిషనర్ సూచించారు.ప్రజల సహకారం లేకుండా ఆరోగ్యకరమైన నగరం నిర్మించలేమని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, డి.ఇసత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏ.ఈ .తిరుమలయ్య, వార్డు ఆఫీసర్ బుగ్గ ప్రశాంత్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్,టీఎంసీ శ్వేత, సయ్యద్ సమ్మి, గౌస్ మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు జ్యోతి కర్ణాకర్ బొజ్జ సంజయ్ గద్దల శిరీష తదితరులు పాల్గొన్నారు
