- స్ధానిక సంస్థల ఎన్నికల్లోనే అమలు చేస్తాం
- ప్రభుత్వ పరంగా కుదరకుంటే పార్టీ పరంగా ఇస్తాం
- కాంగ్రెస్ తీర్మాణాన్ని బీఆర్ఎస్,బీజేపీ ఆమోదించాలి
- సీఎం రేవంత్ రెడ్డి సంచల వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగపరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన కులగణన సర్వేపై చర్చలో సీఎం కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను ప్రాతినిధ్యం కల్పించడానికి కట్టుబడి ఉందన్న ఆయన బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు సిద్ధమా? ఈ అసెంబ్లీ వేదికపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారికి సవాల్ విసిరారు. బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగ మార్పులు అవసరమైతే, మనం దానికై కృషి చేస్తామని చెప్పారు. అయితే అప్పటి వరకు రాజకీయంగా, నైతికంగా కట్టుబడి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించబోతోందన్నారు. తమ చిత్తశుద్దికి ఇది నిదర్శమన్నారు. అయితే సీఎం చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ వర్గాల హక్కులపై రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.