- కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు
- నైపుణ్యం ఉన్నవారిలో బీసీలే అధికం
ముద్ర, తెలంగాణ బ్యూరో : కులగణన సర్వేను సభలో పెట్టారని దీని ఉద్దేశ్యం ఏమిటీ?, బీసీ రిజర్వేషన్లు పెంచుతారా? పెంచితే ఎంత పెంచుతారు?.. లేక కాగితాలకే పరిమితం అవుతందా అని అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, ఆ తీర్పుకు లోపడే ప్రభుత్వం పనిచేస్తుందా అని ఆయన ప్రశ్నించారు కామారెడ్డి బీసీ డిక్లిరేషన్లో 44 శాతం పెంచుతామని హామీ ఇచ్చారని, ఎంత పెంచినా ప్రాక్టికల్ గా ఉండాలన్నారు. కులగణన మీద అసెంబ్లీ చర్చ ముగిశాక, కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దని ఆయన కోరారు. ఒక్కరోజులో హడావుడిగా చేసిన సర్వేకు, ప్రస్తుత కులగణన సర్వేకు చాలా తేడా ఉందన్నారు.
కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. 3 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కులగణన సర్వే జాబితాను గ్రామాల్లో పెట్టి మిగిలిన వారి పేర్లను కూడా నమోదు చేయాలని ఆయన సూచించారు. రీ సర్వే చేయాలంటే ఎప్పటికీ అవదని అన్నారు. 2014 సర్వేతో ప్రస్తుత కులగణనను పోల్చరాదన్నారు. ఏదైనా ఒకపని చేస్తే విమర్శలు రావడం అనేది సహజమేనని, అలాగని సమాచారం దాచేస్తే ఎవరికి ఉపయోగమని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్సీలకు ఉన్న మేదస్సు , పనితనం ఎవరికీ లేదన్నారు. నైపుణ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళలో బీసీలే ఉన్నారని అన్నారు. నేర్పరితనం ఉన్నవాళ్లను కులంపేరుతో బంధించారని అన్నారు.