- ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పక్కా ఇళ్ళను కూలగొట్టే పనిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. 1965లో అల్వాల్లో ఏర్పడిన కాలనీని, పాత కాలానీ నుండి ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ, గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు.ఆనాడు ఇక్కడ జనావాసాలకు ఆస్కారం లేదని, అప్పుడు ఇల్లు కట్టుకున్నరని ఆయన వెల్లడిచారు.ఒక తరం త్యాగం చేస్తే, రెండో తరం ఇల్లు కట్టుకుందని, మూడో తరం చదువుకుంటోందని అన్నారు. బాలాజీ నగర్, అరుందతి నగర్ లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక, ప్రజల జీవనంలో మంచి మార్పు వస్తదని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే, నేను ఎవరు చెప్పినా వినను, నాకు నేను నిర్ణయం తీసుకుంటానంటాను అనే రీతిలో వ్యవరిస్తున్నారని ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పక్కా ఇల్లు కూలగొడుతూ, అడ్డమొచ్చిన వాళ్లను బుల్డోజర్లతో తొక్కవలసిందే అన్నట్లుగా రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని ఆయన విమర్శించారు.ఆనాడు ధనిక రాష్ట్రమని చెప్పిన కేసీఆర్..కనీసం లక్ష రుణమాఫీ చేయడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు.చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేకపోయారని అన్నారు.ఆర్థికమంత్రిగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తనకు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి గురించి అవగాహన ఉందన్నారు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పనులకు అనేక రకాలుగా అబద్ధాలు ఆడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని 15 నెలల పాలనలోనే ప్రజలకు అర్థమైందని ఎంపీ ఈటల అన్నారు.