మహాదేవపూర్, ముద్ర:
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ధన్వాడలోని రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తరువాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, రవాణా, హెలిప్యాడ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మహాదేవ పూర్ పిఏ సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.