Take a fresh look at your lifestyle.

కీలక ప్రాజెక్టులకు చేయూతనివ్వండి … రాష్ట్రం పురోగతి వైపు దూసుకువెళ్తోంది

  • పీఏఎంవై కింద 20ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయండి
  • మెట్రో ఫేజ్ -IIను జేవీగా చేప‌ట్టాలి…
  • మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించండి..
  • హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ డ్రైనేజీ స్కీంల‌కు నిధులు ఇవ్వండి..
  • కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విన‌తి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రభుత్వం చేపట్టతలచిన మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు ఆర్ధిక చేయూతనివ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి… కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మూసీలో మురుగు చేర‌కుండా న‌దికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేటాయించాల‌ని అభ్యర్ధించారు. అమృత్ 2.0 లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు స‌మ‌కూర్చాల‌ని కోరారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీపంలోని 27 ప‌ట్ట‌ణ పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో మురుగు నీటి నెట్‌వ‌ర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్ల‌తో స‌మ‌గ్ర మురుగునీటి మేజ‌ర్ ప్లాన్ (సీఎస్ఎంపీ) త‌యారు చేశామ‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. శుక్రవారం హైదరాబాద్​ లోని ఐటీసీ కాకతీయ హోటల్​ లో పీఏఎంవై (యూ)… ప‌ట్ట‌ణాభివృద్ధి, విద్యుత్ శాఖ‌ల‌పై కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల గురించి కేంద్రమంత్రికి విన్నవించారు. రాష్ట్రంలో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌ను నోటిఫై చేసింద‌ని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం.. అక్కడ రూ.41,70 కోట్ల‌తో స‌మ‌గ్ర భూగ‌ర్భ నీటి పారుద‌ల (యూజీడీ)ప‌థ‌కాన్ని చేప‌ట్టేందుకు నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

పీఎం కుసుమ్ కింద ల‌క్ష సౌర పంపులివ్వండి

రాష్ట్రంలోని గిరిజ‌న రైతుల‌కు నిరంత‌రం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద ల‌క్ష సౌర పంపులు కేటాయించాల‌ని రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కు విజ్ఞ‌ప్తి చేశారు.కుసుమ్ -సీ ఎఫ్ఎల్ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్ల‌ను కేటాయించాల‌ని కోరారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా, నెట్‌వ‌ర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 9 ప్రాజెక్టు నివేదిక‌ల‌ను కేంద్రానికి స‌మ‌ర్పించామ‌ని, వాటిని వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూష‌న్ సెక్ట‌ర్ స్కీం (ఆర్డీఎస్ఎస్‌)లో తెలంగాణ డిస్క‌మ్‌ల‌ను చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ‌ల‌కు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీక‌ర‌ణ కార్పొరేష‌న్ (ఆర్ఈసీ) ఇచ్చిన రుణాల‌కు సంబంధించిన వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌న్నారు. కొత్త పున‌రుత్ప‌త్తి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండేళ్లకు పైగా సమ‌యం ప‌డుతుంద‌ని.. దాంతో ఆర్‌పీపీవో ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయినందుకు విధించే జ‌రిమానాలు మాఫీ చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. పున‌రుత్ప‌త్తి విద్యుత్ నిర్వ‌హ‌ణ కేంద్రాల అప్‌గ్రేడేష‌న్‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిధులు కేటాయించాల‌ని కోరారు.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) 2.0 కింద తెలంగాణ‌కు 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దేశ ప‌ట్ట‌ణ జ‌నాభాలో 8 శాతం ప్ర‌జ‌లు తెలంగాణ‌లో ఉన్నార‌ని కేంద్ర మంత్రికి తెలిపారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి స‌మ‌గ్ర‌మైన డాటా, పూర్తి ప్ర‌ణాళిక‌తో స‌న్న‌ద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని సీఎం కోరారు. దేశంలోని మ‌హా న‌గ‌రాలైన ఢిల్లీ,చెన్నై,బెంగ‌ళూరుతో పోల్చితే హైద‌రాబాద్‌లో మెట్రో క‌నెక్ట‌విటీ త‌క్కువ‌గా ఉంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో మెట్రో ఫేజ్‌-2 కింద ఆరు కారిడార్ల‌ను గుర్తించామ‌ని కేంద్ర మంత్రికి వివరించారు. ఇందులో కారిడార్ -4: నాగోల్‌-శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (36.8 కి.మీ.), కారిడార్ -5: రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), కారిడార్‌-6: ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), కారిడార్‌-7: మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), కారిడార్-8: ఎల్ బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ), కారిడార్- 9: రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం-ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివ‌ర్సిటీ) (40 కి.మీ.) ఉన్నాయ‌ని.. ఇందులో మొద‌టి అయిదు కారిడార్ల‌కు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్త‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్య‌య‌మ‌వుతుంద‌న్నారు. డీపీఆర్లు ఆమోదించ‌డంతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్త భాగ‌స్వామ్యం (జేవీ) కింద చేప‌ట్టి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌, ప్ర‌జాసంబంధాలు) హ‌ర్కార వేణుగోపాల్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.