పారదర్శకంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు రాజకీయ పక్షాలు బిఎల్ఎ లను నియమించాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను సమగ్రంగా వివరించారు. జూన్ 25 నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారం లు ఇస్తారన్నారు. ఓటర్లు నింపిన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారం లు జూలై 24 వరకు తిరిగి తీసుకుంటారని వివరించారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలు ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కూడా సమర్పించవచ్చన్నారు. ఎస్ఐఆర్ కి సంబంధించి, జూలై 31న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో ఈఆర్ఓ లను సంప్రదించవచ్చునని చెప్పారు. అక్టోబర్ 1న తుది ఎలక్టోరల్ రోల్ జాబితా ప్రదర్శిస్తామని వివరించారు.
ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరుపున బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని తెలిపారు. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఖానాపూర్ ఈఆర్ఓ గంగాధర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.