ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని పరమపూజ్యులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి దివ్య సాన్నిధ్యంలో నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మహర్షి ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి భక్తుని బాధ్యత అని పేర్కొన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠతో ఆలయానికి మరింత ఆధ్యాత్మిక వైభవం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జక్కా రాఘవేంద్ర రెడ్డి, జక్కా కవిత, వార్డు మెంబర్లు ఎలిమినేటి సురేష్ రెడ్డి, ఎలిమినేటి సునీల, రాములు, దేవేందర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కొత్త సత్తయ్య, గుండు అర్జున్, కాసాని శేఖర్ యాదవ్, జక్కా జంగా రెడ్డి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.