ముద్ర, వీపనగండ్ల: మహిమానిత పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రానికి శివ స్వాములు ఇరుముడితో పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మండల కేంద్రంలోని వీపనగండ్లలో శివ స్వాములు 41 రోజులు ఉపవాస దీక్షతో శివమాలను ధరించి గురువారం రోజు స్థానిక ఉమామహేశ్వరాలయంలో ఇరుముడి ధారణ చేశారు. మొదటగా శివాలయంలో శివ స్వాములు భక్తిశ్రద్ధలతో శివలింగానికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. శివ స్వాములు గోత్రనామాలతో పూజలు నిర్వహించి ఇరుముడి బస్తాలో మల్లికార్జున స్వామి కి సంబంధించిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, విభూతి, కర్పూరం, టెంకాయలు, బియ్యం, బిల్వదళాలు తో పూజలు నిర్వహించి ఇరుముడి పూజా కార్యక్రమాన్ని గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాదయాత్రగా బయలుదేరుతున్న శివ స్వాములకు కుటుంబ సభ్యులు గ్రామస్తులు భాజా భజంత్రీలు భజన కార్యక్రమాలు కోలాటాల మధ్య వీడ్కోలు పలికారు.
