- ఆర్ఓబీ వద్ద విరిగిన క్లస్టర్.
- ఆగిపోయిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్.
- తరచూ ఆగిపోతున్న రైళ్లు.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఖాజీపేట-బలర్షా రైల్వే మార్గం ఇరువైపులా రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా కూనారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో మళ్ళీ ఈ పరిస్తితి ఏర్పడింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. దీంతో వందలాదిగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సుల కోసం రాజీవ్ రహదారిపైకి చేరుకున్నారు. కాగా, ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయలుదేరిన ఈ రైలు 10.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాల్సి ఉంది.ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో..మరోవైపు జిల్లా కేంద్రంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జి నిర్మాణ పనులు కోసం రైళ్లను నిలిపివేస్తున్నారు. ఈ కారణంగా కొలనూర్, పోత్కపల్లి, బిజిగిరి షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, రాఘవాపూర్, రామగుండం ఇంకా పలు స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైలుతోపాటు ప్యాసింజర్ రైలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయం 6:30 నిమిషాల నుంచి ట్రైన్లు నిలిచిపోవడంతో ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10:30 వరకు కూడా రైలు నడవలేదు. ఈ కారణంగా ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రైల్వే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు.