- బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగితే చట్టపరమైన చర్యలు తప్పవు.
- ఇలాంటివి చూసి పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉన్నది.
- ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి.
- కె. నరసింహ , ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి : బహిరంగంగా మద్యం తాగడం, ధూమపానం చేయడం లాంటివి చట్టరీత్య నేరం అని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచాం అని, అక్రమ సిట్టింగ్ లు, బహిరంగంగా మద్యం తాగడం, సిగరెట్ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటివి చూసి వాటికి పిల్లలు అలవాటు పడి తప్పుడు మార్గం లోకి వెళ్ళే అవకాశం ఉన్నది అని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని, ఇలాంటివి బహిరంగంగా చేయడం మానుకోవాలని అన్నారు. బహిరంగంగా మద్యం తాగడం, ఎదుటివారికి ఇబ్బంది కలిగించడం చేస్తే పట్టణ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం అన్నారు.మైనర్ పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తుల లాంటి మత్తు పదార్థాలను అమ్మవద్దు అని హెచ్చరించారు. వీటి వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది అని ఎస్పీ నరసింహ గుర్తు చేశారు.