యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం రెండవ ఏరియా జీఎం కార్యాలయం లో సోమవారం ఏరియా స్తాయి త్రైపాక్షిక రక్షణ సమావేశంపై, రక్షణ చర్యలపై సమీక్ష సమావేశం జరిగింది. సాయంత్రం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఆగస్టు 7న నిర్వహించబోయే రక్షణ త్రైపాక్షిక సమావేశంపై, ఏరియాలో చేపట్టిన రక్షణ పరమైన చర్యలపైన, ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య ఏరియా అధికారులు, కార్మిక సంఘం ప్రతినిధులతో ముందస్తు సమీక్షా జరిపారు. ఈ సమావేశం లో ఏరియాలో చేపట్టిన రక్షణ చర్యలను, ఏరియా రక్షణ అధికారి ఎస్.సంతోష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, కార్మిక సంఘం ప్రతినిధుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి, అన్ని భూగర్భ గనులు, ఉపరితల గనులకు సంబందిచిన వివరాలను పూర్తి స్థాయిలో సిద్దం చేసుకోవాలని ఏరియా జీఎం బి.వెంకటయ్య అధికారులకు సూచించారు. ఇక ఈ సమీక్ష సమావేశంలో రామగుండం రీజియన్ రక్షణ జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రెటరీ జి.రవీందర్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, వకీల్ పల్లి గని ఏజెంట్ ఏ.నెహ్రూ, ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజాజీ, డిజిఎం ఐఇ మురళీకృష్ణ, ఏరియాలోని అన్నీ గనులు, విభాగాల అధికారులు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.