ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
మక్కలు, వరి ధాన్యం లిఫ్ట్ చెయ్యడం లో జాప్యం జరుగుతుందనీ గమనించి ఏంసిలోని షెడ్ ఉన్న ప్రాంతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని దిగుమతి చేయాలని ఏఎంసి సిబ్బందిని ఆదేశించారు.
షెడ్ లోపల ఉన్న వరి, మక్కలను వెంటనే కాంటా చేసి కొనుగోలు చేసి శుభ్రం చేయాలని, ఏఎంసి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొనుగోలు ధాన్యాన్ని లారీలు ట్రాక్టర్ లో తరలించిన ధాన్యాన్ని ఇక్కడ దిగుమతి చేసి సివిల్ సప్లై అధికారుల సమక్షంలో భద్రపరచనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని, వచ్చే ఖరీఫ్ లో మాత్రం సన్న వడ్లను పండించాలని, గత మూడు సీజన్ లుగా దొడ్డు రకం వడ్లు పండించడం వలన గోదాం మరియు మిల్లులో స్టోరేజ్ కి ఇబ్బందిగా ఉందని అందుకే రైతులు సన్న వడ్లు పండిస్తే రేషన్ దుకాణాలకు మన ధాన్యాన్ని పంపించనున్నట్లు రైతులకు తెలిపారు.