సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
నాగర్ కర్నూల్ మండలం పరిధిలోకుమ్మెర మల్లన్న జాతర దైవ దర్శనానికి వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
జాతర సందర్భంగా రజకులకు పై దాడి జరగడంతో పాటు ఒక చిన్నారి మృతి చెందిన ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబంపై దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే బీసీలు ఏకమై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలను పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దుర్గయ్య, భూంపల్లి కనకరాజు, భూంపల్లి లింగస్వామి, భూంపల్లి శ్రీనివాస్, భూంపల్లి వైకుంఠం, నారాయణరావుపేట శ్రీనివాస్, కోడూరి నరేష్, చెవిటి యాదగిరి, చెవిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.