Take a fresh look at your lifestyle.

అప్పుడు మీరు మంత్రి..!  నిబంధనలు తెలియవా..?

  • కేబినెట్​, ఫైనాన్స్​ శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు 
  • ప్రైవేట్​ సంస్థలకు చెల్లించేందుకు అనుమతి లేదనుకున్నారా..? 
  • అసలు ఈ రేసు తో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి
  • టికెట్లు అమ్మడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది..? 
  • మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ
  • ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ
  • ఈడీ కార్యాలయం ముందు బీఆర్​ఎస్​ నేతల బైఠాయింపు
  • ర్యాలీగా వస్తున్న నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముద్ర, తెలంగాణ  బ్యూరో :-ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ మొదటి సారిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను  సుమారు ఏడు గంటల పాటు  ప్రశ్నించింది. ప్రధానంగా నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. గురువారం బషీర్ బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో  కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.  ఉదయం 11 నుంచి  సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన విచారణ సందర్భంగా హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపైనా ఆయనను ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. సంస్థ నుంచి రూ.55కోట్ల బదిలీ వ్యవహారంపై పలు ప్రశ్నలను సందించినట్లుగా సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ఆరా తీసుకున్న ఏసీబీ నుంచి వివరాలు తెప్పించుకున్న ఈడీ మరింత లోతుగా విచారించిన ట్లుగా సమాచారం. కాగా దర్యాప్తులో భాగంగా ఈ  కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఇప్పటికే ఈడీ విచారించింది. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు? ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు? ఎలా పంపారు? అవి చివరికి ఎవరి ఖాతాలో పడ్డాయి? ఇందులో మీ ( కేటీఆర్‌)తోపాటు అధికారుల పాత్ర ఎంత? ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడచింది?  తదితర  వివరాలను ఈడీ అడిగి తెలుసుకున్న ట్లుగా తెలుస్తోంది.
అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు అని ప్రశ్నించినట్లు గా తెలుస్తోంది. అప్పుడు మీరు మంత్రి..! నిబంధనలు తెలియవా..? కేబినెట్​, ఫైనాన్స్​ శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు ? ప్రైవేట్​ సంస్థలకు చెల్లించేందుకు అనుమతి లేదనుకున్నారా..? అసలు ఈ రేసు తో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి? టికెట్లు అమ్మడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది..? తదితర అంశాలపై కేటీఆర్ పై విచారణ అధికారులు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
బదిలీ అయిన రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో కంపెనీ నుంచి ఇతర అకౌంట్లకు ఏమన్నా బదిలీ అయిందా?  అనే కోణంలో కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘హెచ్‌ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తంలో నిధులు ఎలా చెల్లిస్తారు… ఈ రేసు నిర్వహణతో రూ.700 కోట్ల లాబం వచ్చిందని చెబుతున్నారని.. దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా..?  అంటూ కేటీఆర్‌ను ఈడీ అధికారులు ఆరా తీశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. కాగా ఈ కేసులో బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే బ్యాంకు అధికారులపై కూడా కేసు నమోదు చేసి వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు
విచారణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు పెద్దఎత్తున వినిపించడంతోఈడీ కార్యాలయానికి ఉదయం నుంచే  బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ భైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు పలుమార్లు యత్నించారు.  దీంతో పలుమార్లు  కార్యకర్తలకు, పోలీసులు తీవ్ర స్థాయిలో  తోపులాటలు  చోటుచేసుకున్నాయి. దీంతో ఈడీ కార్యాలయం  గంటల పాటు  ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలను కూడా తెప్పించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తదితర కీలక నేతలు కూడా ఈడీ కార్యాలయం వద్దకు రావడంతో ఏదో జరగబోతున్నదన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో నెలకున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు మరింత ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఈడీ కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా మరో వైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లే రహదారిపై ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద కూడా భారీగా బందోబస్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.