Take a fresh look at your lifestyle.

పథకాలు అమలు చేశామని ఢిల్లీలో రేవంత్ అబద్ధాలు

 

  • ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదు, అన్ని గమనిస్తారు
  • కులగణన సర్వేకు రేషన్ కార్డుల జారీకి ముడెందుకు?
  • అర్హులందరికీ రేషన్ కార్డులు దక్కేలా బీఆర్ఎస్ పోరాటం
  • వ్యవసాయ కూలీల భరోసాలో కోతలెందుకు?
  • రుణమాఫీ విషయంలో రేవంత్ మోసం

ముద్ర , తెలంగాణ బ్యూరో :- తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్‌ రెడ్డి గొప్పలు చెబుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన అబద్దాలకు మహారాష్ట్రలో తన్నారని, ఇప్పుడు అవే అబద్ధాలను ఢిల్లీలో చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదని, వారు అన్నింటినీ గ్రహిస్తారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.. మొదటి గ్యారంటీ మహాలక్ష్మీ నుంచి చివరి గ్యారంటీ చేయూత దాకా అన్నింటినీ ఎగ్గొట్టారని అన్నారు. అన్ని హామీలను ఎగగొట్టి, తూతూమంత్రంగా అర గ్యారంటీ మాత్రమే అమలు చేసి అన్నీ చేసేశామంటే ఎలా అని రేవంత్‌ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి అందరికి పరమాన్నం అని చెప్పి, అధికారంలోకి రాగానే పంగ నామాలు పెడుతున్నడని ఆయన విమర్శించారు.

ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదని.. చివరి హామీ చేయూతకు దిక్కు లేదని అన్నారు. మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే పరిస్థితి అని తెలిపారు. అన్నింట్లో కోతల విధింపేనని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్లుగా జనవరి 26 రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజున ప్రారంభించే కార్యక్రమాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొడుతున్నారని, . ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి 55 వేలు ఇచ్చామని అబద్దాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అందులో 44వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లవే అని హరీష్ రావు తెలిపారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు మోసమని, నిరుద్యోగ భృతి మోసమని, జాబ్ క్యాలెండర్ మోసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులగణన సర్వేకు రేషన్ కార్దులకు ముడి ఎందుకు?

కులగణన సర్వేకు రేషన్‌ కార్డులకు ఎందుకు ముడిపెట్టారని హరీష్ రావు నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌ కార్డులు ఇవ్వరా అని ప్రశ్నించారు. కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపించారని ఆయన ఆరోపించారు. ఆన్ లైన్‌లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని తెలిపారు. ఆ దరఖాస్తులు అన్నింటినీ చెత్తబుట్టలో వేశారని అన్నారు. ప్రజాపాలనలో 11లక్షల దరఖాస్తులు వస్తే ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదని నిలదీశారు.

కుల గణన సర్వే చేసేటప్పుడు ఇది ఆప్షనల్ మాత్రమేనని, బలవంతం లేదని, ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చని చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నరని హరీష్ రావు మండిపడ్డారు. వాయిదా వేసుకుని అయినా సరే అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రామగ్రామన నిరసనలు చేపడటామని హరీష్ రావు హెచ్చరించారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అర్హులకు రేషన్‌ కార్డులు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

వ్యవసాయ కూలీల భరోసాలో కోతలెందుకు ?

వ్యవసాయ కూలీలకు భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వం కోతలు విధించడం దుర్మార్గమని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కూలీలు అందరికీ ఏడాదికి 12వేలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కూలీలు గ్రామాల్లో ఉంటే.. గ్రామాల్లో దరఖాస్తులే తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీలో 52లక్షల మంది కార్డులు, 1.4కోట్ల మంది కూలీలు ఉన్నారని తెలిపారు. 20 రోజులు పని చేసే వారికే అని నిబంధనలు పెట్టి, అర్హులను 25 లక్షలకు కుదించారని ఆరోపించారు. ధరణిలో పెట్టి ఆ 25లక్షల్లో గుంట భూమి ఉన్నా ఇచ్చేది లేదని అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారని తెలిపారు. కోటి మంది వ్యవసాయం కూలీలు ఉంటే, ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారని.. ఇదేం న్యాయమని హరీష్ రావు ప్రశ్నించారు.

రుణమాఫీ విషయంలో రేవంత్ మోసం

రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ ఇలా అన్ని విషయాల్లో రైతులను రేవంత్‌ రెడ్డి తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అప్పుకట్లాని బ్యాంకు అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న జాదవ్ నాగోరావు అనే రైతు కుటుంబానికి రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.