ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చారిత్రక ప్రాధాన్యత ఉన్న నిర్మల్ లో ఇటు చూసినా కోటలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆనాటి చారిత్రక విశేషాలు చరిత్రకారుడు తుమ్మల దేవరావు పరిశీలనలో వెలుగు చూశాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మనాయక రాజుల కాలంలో కోటల నిర్మాణం జరిగినట్లు ప్రతీతి.తూర్పున ఉన్న బత్తిస్ ఘడ్ కోట ఎంతో ప్రముఖమైందని డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. కోటకు తూర్పున రహస్యంగా ఒక మెట్ల బావిని ఆయన గుర్తించారు. సముద్రమట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కోటపై నీటి జాడలు లేకున్నా దీనిని సైనిక స్థావరంగా రాజులు ఉపయోగించుకున్నారని అన్నారు. శత్రువులు కోటను ఆక్రమించుకున్నపుడు రహస్య మార్గం ద్వారా సైనికులు తప్పించుకునేలా మెట్ల బావిని తవ్వారు. 200 మెట్లు దిగుతూ బావిని చేరుకోవాల్సి ఉంటుంది. అడుగు భాగంలో ఒకవైపు మీటరు వైశాల్యంతో సొరంగ మార్గాన్నివిఏర్పాటు చేశారు. ఈ మార్గం ద్వారా సోన్ సమీపంలోని ఘడ్ కు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని ఒక పది మీటర్ల వరకి వెళ్లి చూడవచ్చు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మెట్ల బావి శిథిలం కాకుండా భావితరాల వారికి అందించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డాక్టర్ తుమ్మల దేవరావు అన్నారు.