- ఇఫ్తార్, సెహ్రి సమయాల్లో విద్యుత్ కు అంతరాయం తలెత్తకుండా చూడండి
- ఉపవాస దీక్షల నేపథ్యంలో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలి
- ఆయా శాఖల అధికారులకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా అల్ఫసంఖ్యాకవర్గాల సంక్షేమ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..
రంజాన్ పండుగ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ముస్లిం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.విద్యుత్, తాగునీరు, మున్సిపల్, పంచాయతీరాజ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు.ఉపవాస దీక్షలు చేపట్టే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ప్రధానంగా విద్యుత్, నీరు, పారిశుధ్యం,శాంతిభద్రతలు వైద్య,ఆరోగ్యం గురించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఆయా శాఖల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక పరిపాల విభాగం సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.
రంజాన్ ఇఫ్తార్, సెహ్రీ సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మసీదులు, ఈద్గాల ప్రదేశాల చుట్టూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి రోడ్లపై సరైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.రంజాన్ సందర్భంగా శాంతిభద్రతలను నిశితంగా పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారులకు సూచించారు.ముఖ్యంగా తరావీహ్,సెహ్రీ,ఇఫ్తార్ సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా,అవాంచనీయ ఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమైన మార్కెట్లు మరియు మసీదుల దగ్గర ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచాలని ట్రాఫిక్ పోలీసులను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరపున ముందస్తు ఏర్పాట్లపై వారి సలహాలు మరియు సూచనలు జిల్లా యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది.