ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా పీడీఎస్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువు దారి తప్పి వికృత చేష్టలతో ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాన్ని అనుకుని ఉన్న పాఠశాలలో లైంగిక వేధింపులకు పాల్పడితే సస్పెండ్ చేశారే తప్ప లైంగికంగా వేధించిన ఉపాధ్యాయునికి కఠినమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇది ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృత్తం అయ్యేందుకు కారణం అవుతుందన్నారు. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుని పైన పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.