Take a fresh look at your lifestyle.

నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

  • సర్వత్ర ఉత్కంఠ!
  • ఏం సమాధానం చెబుతారన్న అంశంపై గులాబీ నేతల్లో టెన్షన్..టెన్షన్.
  • న్యాయనిపుణులు, ఇంజనీర్లు, పార్టీ నేతలతో ఫుల్ గా కసరత్తు చేసిన బీఆర్ఎస్ అధినేత.
ముద్ర, తెలంగాణ బ్యూరో:  కాళేశ్వరం కమిషన్ ఎదుట నేడు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  హాజరుకానున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.విచారణ సందర్భంగా ఆయనను కమిషన్ ఏం ప్రశ్నలు వేస్తుంది?ఎలాంటి సమాధానాలు రాబట్టేందు కు యత్నిస్తుంది?  వారు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ తగు సమాధానాలు చెబుతారా? లేదా? తదితర అంశాలపై ప్రస్తుతం గులాబీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.విచారణ అనంతరం ఆయన మీడియా ముందు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడతారు? అన్న విషయాలపై ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కమిషన్ ఎదుట ఇరిగేషన్ అధికారులు, మాజీ అధికారులు, మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు హాజరైన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా కేసీఆర్ వంతు వచ్చింది.వాస్తవానికి హరీశ్ రావు, ఈటెల కంటే ముందుగా ఈ నెల 5వ తేదీనే కేసీఆరే విచారణకు హాజరుకావాల్సి ఉంది.ఆయనకు పంపిన  పంపిన నోటీసుల్లో సైతం కమిషన్ పేర్కొన్నది. అయితే విచారణ తనకు కొంత సమయం కావాలని కేసీఆర్ కోరడంతో కమిషన్ అందుకు అంగీకరించింది.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బుధవారం విచారణకు హాజరవుతున్నారు.కాగా కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ చాలా హోం వర్క్ చేశారు.పలు సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్లు, నీటి పారుదల రంగ నిపుణులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో సమావేశమై చర్చించారు. నాడు ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి పూర్తయ్యే వరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకున్నారు.రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోను, హరీశ్ రావుతోను చర్చించారు.ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ చేసిన విచారణ అంశాలు, ఇప్పటివరకు జరిగిన పరిణమాల వివరాలు, కమిషన్ ఎదుట హాజరయినప్పుడు హరీశ్ రావును సంధించిన ప్రశ్నలు – వాటి సమాధానాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యే ముందు అంటే బుధవారం మరో దఫా తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, రూపకల్పన, నిర్మాణం, నాణ్యతా లోపాలు, నిర్మాణ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుక దాగి ఉన్న అక్రమాలు వంటి విషయాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసింది.ఈ కమిషన్‌కు భారతదేశపు మొట్టమొదటి లోక్‌పాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన పినాకి చంద్ర ఘోష్  నేతృత్వం వహిస్తున్నారు.
  • కాళేశ్వరంపై  పొలిటికల్ వార్.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది.ప్రపంచంలో అరుదైన ఇంజనీరింగ్ అద్భుతమని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా,గత అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేసింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి బ్యారేజీ (మేడిగడ్డ)లోని ఏడో బ్లాక్‌లోని 16 నుంచి 21 పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో బ్యారేజీలోని కొంత భాగం దెబ్బతిని, నీరు లీక్ అయ్యింది.దీనిపై విచారణ జరిపిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పింది.మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న డిజైన్, నిర్మాణ లోపాలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలలో కూడా ఉన్నట్లు గుర్తించింది.ఈ బ్యారేజీలలో కూడా “డిస్ట్రెస్ కండిషన్స్” (నష్టం సూచనలు), లీకేజీలు కనిపించాయని పేర్కొంది.దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత విపత్తు అని ప్రకటన చేసింది.దీనిపై జ్యుడీషియల్ కమిషన్ ద్వారా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు. కాళేశ్వరం తెలంగాణకు జీవనాడి అని, తమ పార్టీని అప్రతిష్ట పాలు చేసే కుట్రగా మాజీ మంత్రి హరీశ్ రావు కమిషన్ ఎదుట హాజరైన అనంతరం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసే కుట్రగా అభివర్ణించారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను దశాబ్దాలుగా పూర్తి చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారన్న దుగ్ధతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి తెర లేపినట్లు అయింది.

Leave A Reply

Your email address will not be published.