గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా బోగస్సే – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే
- ఈ సర్వే నివేదిక కాంగ్రెస్ అబద్ధపు దుష్ప్రచారానికి చెంపదెబ్బ
- అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక గత ప్రభుత్వం పైన చేస్తున్న ఆవాస్తవాలను ఆర్థిక సర్వే ఎండగట్టింది
- ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, అభివృద్ధిని కొనసాగించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పాలనచేతగాక గత ప్రభుత్వ పదేళ్ల పాలనపైన చేస్తున్న అనేక దుష్ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక దుష్ప్రచారాలకు తగు సమాధానాన్ని ఇచ్చిందన్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న అనేక అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, ఆర్ధిక మైలురాళ్లు 10 సంవత్సరాల బీఆప్ ప్రభుత్వ పరిపాలనకు తార్కాణమన్నారు.
తెలంగాణ మోడల్ విజయవంతం అయిందనేందుకు ఇదే సాక్ష్యమన్నారు. అతి తక్కువ కాలంలో అనేక విజయాలు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన దోహదం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చెందిన తెలంగాణను అధపాతాళానికి తీసుకెళ్లకుండా పరిపాలన పైన దృష్టి సారించి…… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2024-2025 తెలంగాణ రాష్ట్రం గత దశాబ్దంలో సాధించిన సమగ్ర, సమతుల, సమగ్రాభివృద్ధిని మరోసారి ప్రతిబింబించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని సర్వే స్పష్టంగా తెలియజేస్తోందన్నారు.
ఆర్థిక సర్వే ప్రకారం, తెలంగాణ స్వంత ఆదాయ వనరులలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రం 88 శాతం ఆదాయాన్ని స్వయంగా సేకరించుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఇది గట్టి సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రంపై ఆధారపడకుండా, తెలంగాణ స్వంతంగా ఆదాయాన్ని పెంచుకోవడం బీఆర్ఎస్ హయాంలో అమలైన ఆర్థిక పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణలో మొత్తం సాగుబడి భూమిలో 90శాతంకు పైగా ప్రాంతం సాగునీటి సదుపాయాన్ని పొందుతోందని సర్వే చెప్పిన వాస్తవం సాగునీటి ప్రాజెక్టులపైన కాంగ్రెస్ చేస్తున్న దుష్ట్రచారాన్ని ను తిప్పికొట్లుఅయిందన్నారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి విప్లవాత్మక ప్రాజెక్టుల కారణంగా సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆర్థిక సర్వే గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రస్థాయిలో కొనసాగుతుండటం బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రణాళికల విజయాన్ని చూపిస్తున్నాయన్నారు.
2017లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించిన వుయ్…హబ్ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల పొత్సాహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ హబ్, ఇప్పుడు రాష్ట్ర మహిళలకు అద్భుత అవకాశాలను అందిస్తూ, వేలాది స్టార్టప్లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. తెలంగాణ దేశంలోనే 100 శాతం తాగునీటి సరఫరా అందించిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ ఘనత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమై, ప్రతి ఇంటికి నల్లా నీరు అందజేస్తోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిచిందని కేటీఆర్ తెలిపారు.
ఈ సర్వే ప్రకారం, హై పెర్ క్యాపిటా జీఎస్ వితో(Gross State Value Added) తెలంగాణ సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందన్నారు. రాష్ట్ర ఐటి, స్టార్టప్, ఫిన్టెక్ రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. గ్లోబల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా కొనసాగినదానికి నిదర్శనమన్నారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక సర్వే తిప్పికొట్టాయన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, ఆర్థిక సర్వే వంటివి కాంగ్రెస్ కి కనువిప్పు కలిగిస్తాయన్నారు. ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటి పారుదల వంటి అన్ని రంగాల్లోనూ తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిందని, ఈ నిజాలు ఎవరికీ ఇష్టం లేకపోయినా, తెలంగాణ ప్రజలకు మేలు చేసిన హయాం ముమ్మాటికీ బీఆర్ఎస్ పాలననే అన్నారు. కేసీఆర్ గురుతులు, చరిత్రను, తెలంగాణకు ఆయన నాయకత్వంలో అందిన ఫలాలును ఏవరు చేరపలేరని కేటీఆర్ అన్నారు.