- ఎన్నో ఏళ్లుగా సాగిన బ్రిడ్జి నిర్మాణ పనులు.
- నాణ్యత లేకపోవడమే అసలు కారణం.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పుర ప్రజల చిరకాల కోరిక అయినటువంటి క్యాతన్ పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా సాగిన నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తూ ఆలస్యం చేసినప్పటికీ పనుల్లో మాత్రం నాణ్యత కరువైంది. స్థానిక క్యాతన్ పల్లి నుంచి రామకృష్ణాపూర్ వైపు వచ్చే బ్రిడ్జి ముగింపులో సోమవారం రాత్రి రహదారి కుంగి,పగుళ్లు ఏర్పడడం స్థానికంగా కలకలం రేపింది. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రామాణాలు పాటించకపోవడంతోనే ప్రారంభమైన కొన్ని రోజులకే ఇలా రహదారి కుంగి,పగుళ్లు కనిపిస్తున్నాయని పుర ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్ అండ్ బి నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకుండా ప్రమాదాలకు నిలయంగా బ్రిడ్జిపై మూలమలుపులను ఏర్పాటు చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొంత మంది ప్రయాణికులు మూల మలుపు వద్ద పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికైన అర్ అండ్ బీ అధికారులు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుడైన కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
