- శ్రీరంగాపురం రంగనాథ ఆలయంలో శ్రమదానం చేసిన ఎస్పీ
ముద్ర,వీపనగండ్ల: ఆలయాలు,ప్రార్థన స్థలాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.శనివారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిదర్ వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ ఆలయాన్ని సందర్శించి,పోలీసుసిబ్బంది,నిస్వార్థ స్వచ్ఛందసంస్థ సభ్యులు మరియు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలలో శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుడి గోపురాలు, ప్రార్థన స్థలాలు, మన వారసత్వ సంపదలని అన్నారు.దాదాపు నాలుగు వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం గల శ్రీరంగాపురం శ్రీరంగనాథ ఆలయాన్ని వనపర్తి సంస్థాన పాలకులు అష్ట భాష బహిరీ గోపాలరావు, నిర్మించగా రాణి శంకరమ్మ మరింత అభివృద్ధి పరిచిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రకృతి సిద్ధంగా ఎంతో ఆహ్లాదకర వాతావరణం,పెద్ద జలాశయం,అద్భుత శిల్ప సంపద గల ఈ ఆలయం వనపర్తి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని ఆయన అన్నారు.త్వరలో రథోత్సవం,జాతర జరగబోతున్న ఈ ఆలయ క్షేత్రాన్ని భక్తులతో పాటు గ్రామస్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆలయ పవిత్రతను కాపాడాలని జిల్లా ఎస్సీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు.దాదాపు నాలుగు గంటల పాటు పోలీసుసిబ్బంది,ఆర్గనైజేషన్ సభ్యులతో కలిసి ఆలయ పరిసరాల ఆవరణంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మరియు విస్తరాకులు వివిధ వ్యర్థాలను ఆయన శ్రమదానం చేసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగాపూర్ ఎస్సై,రామకృష్ణ,నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు,రాజశేఖర్,కార్తీక్,కళ్యాణ్,అంజి,అరవింద్, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
