- డబ్బులు వసూళ్లు చేసిన నకిలీ విలేకరి అరెస్ట్
ముద్ర, మెట్ పల్లి: విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ,ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మెట్ పల్లి పట్టణానికి చెందిన గట్టేపల్లి రాజశేఖర్ ఇతను గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ జీవిస్తున్నాడు.మరియు ‘ఆర్ ఆర్ న్యూస్’ పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో,విలేకరి ముసుగులో అమాయక ప్రజలు,వ్యాపారులు మరియు ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు.వివిధ సమస్యలతో ఉన్న అమాయక ప్రజలను గుర్తించి,తాను విలేకరినని,పోలీసులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి,వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు.గతంలో ఇలా రెండు మూడుసార్లు మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి వద్దకు కొందరిని తీసుకెళ్లి పైరవీ చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడు.అయితే, సీఐ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.దీంతో రాజశేఖర్ సీఐపై కోపం పెంచుకుని,సి ఐ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో,ఫిబ్రవరి 12, 2025న రాజేశ్వరరావుపేటలో అక్రమ మొరం రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఇరిగేషన్ సబ్-డివిజన్ ఇంజనీర్ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్ను కొందరు వ్యక్తులు అడ్డుకుని,బ్లాక్ మెయిల్ చేసి రూ.1,50,000 వసూలు చేసినట్లు రాజశేఖర్ తెలుసుకున్నాడు.దీంతో రాజశేఖర్ కూడా అరుణోదయ్ కుమార్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు.మార్చి 5, 2025న ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో అరుణోదయ్ కుమార్ ఉండగా,రాజశేఖర్ అతన్ని బెదిరించి రూ.1,00,000 డిమాండ్ చేశాడు. లేకపోతే తన న్యూస్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తానని, చంపేస్తానని బెదిరించాడు. భయపడిన అరుణోదయ్ కుమార్ తన వద్ద ఉన్న రూ.5,000 రాజశేఖర్కు ఇచ్చి,మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు.ఆ తర్వాత, రాజశేఖర్ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని సీఐ మెట్పల్లి మరియు పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయాలని భావించి,సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశాడు.’ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ’అనే వాట్సాప్ గ్రూపులో “ఓ రౌడీ షీటర్,ఇరిగేషన్ అధికారి నుండి అక్షరాల 1,50,000 తీసుకున్న రౌడీ షీటర్, స్థానిక సి.ఐ.కి ఫిర్యాదు చేసినా పట్టించుకోని సి.ఐ.ఆర్ఆర్ న్యూస్ తెలంగాణకు ఆశ్రయించిన ఇరిగేషన్ అధికారి.సి.ఐ ఎవరికి అమ్ముడు పోయారు..?” అనే తప్పుడు కథనాన్ని ప్రచురించాడు.ఈ వార్తను చూపి అరుణోదయ్ కుమార్ను మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి మిగతా డబ్బులు డిమాండ్ చేశాడు. అరుణోదయ్ కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్పై మెట్ పల్లి ఎస్ ఐ పబ్బ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనట్లు మెట్ పల్లి సిఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు.