Take a fresh look at your lifestyle.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
రంజాన్ పర్వదినం మానవత్వం, ప్రేమ, మతసామరస్యానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ ఈద్గా ప్రాంగణంలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ మనుషుల మధ్య ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర పర్వదినమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉపవాస దీక్ష ద్వారా ఆత్మశుద్ధి సాధించి, బలహీన వర్గాలకు తోడ్పాటు అందించాలని ఈ పండుగ మనకు సందేశం ఇస్తుందన్నారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఆనందంగా జరుపుకుంటూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని కోరారు.మన పూర్వీకులు చూపిన ఐక్యత మార్గంలోనే ముందుకు సాగాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్.పీ. వెంకటేష్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మున్సిపల్ కార్పొరేటర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.