- పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్థుల ఆందోళన.
- మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం డిమాండ్.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: తనకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) ఉండడానికి ఇళ్లు లేక ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దరఖాస్తు చేసినప్పటికీ తనకు ఇందిరమ్మ ఇళ్ళు రాలేదంటూ మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, మృతుని బంధువులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహులు పరామర్శించారు. అశోక్ కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించి, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని అదే విధంగా రూ. 15 లక్షల నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
