ముద్ర ప్రతినిధి, మెదక్:
న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మర్కంటి రాములు ఖండించారు. గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్కంటి రాములు మాట్లాడుతూ… తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాదిని దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడి చేసినటువంటి ఎస్సైపై ఎన్ఐఆర్ నమోదయ్యేంత వరకు న్యాయవాద వృత్తులను బహిష్కరిస్తూ నిరసన తెలుపడం జరుగుతుందని హెచ్చరించారు. నిరసనలో న్యాయవాదులు జనార్ధన్ రెడ్డి, ఫజల్ అలీ, జీవన్ రావు, రవీందర్, వెంకటేశం, రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.