ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో గురువారం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ప్రియాన్ష్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని, వారి కుటుంబ సభ్యులను కలిసి ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల తర్వాత బాలుడికి కత్రిమ కన్ను అమర్చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిన్నారి ప్రియాన్ష్ కంటి చూపు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం, ఇలాంటి సంఘటనలు మనస్సును కలచివేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదపై ఇప్పటికే అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కలకు స్టెర్లైజేషన్ (సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు) వేగవంతం చేసేలా అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. బాలుడికి ఇప్పటికే శస్త్రచికిత్స పూర్తయిందని, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. కుక్కల దాడిలో బాలుడి కుడి కన్ను తీవ్రంగా దెబ్బతినడంతో చూపు తిరిగి వచ్చే అవకాశం లేదని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొద్ది రోజుల తర్వాత వైద్యులు కృత్రిమ కన్ను అమరుస్తారని కానీ అతనికి కుడి కంటి చూపు తిరిగి రాకపోవచ్చు అని వైద్యులు తెలియజేసారన్నారు..