కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.

భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా పిడి భరద్వాజ్ పలు విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వరంగల్ నుండి కరీంనగర్ వరకు 89 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది జూలై 31 లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. భారత జాతీయ రహదారి సంస్థ, రెవిన్యూ అధికారులు సమన్వయంతో భూసేకరణ తదితర సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయినందున మిగిలిన పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఇందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి నిర్మాణంపై సమీక్ష
కొత్తపల్లి-చిగురుమామిడి, చిగురుమామిడి-హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనుల పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని భూ సేకరణ, ఎలక్ట్రిక్ స్తంభాల తొలగింపు, పునర్నిర్మాణం తదితర అంశాలపై చర్చించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణ పనుల గురించి ప్రతివారం సమీక్షిస్తానని వెల్లడించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఈఈ నరసింహచారి, డి.ఈ రాజశేఖర్ ఉన్నారు.