ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో మంగళవారం మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆలయంలో స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనం, నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు.