కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టంచినా..27న నభూతో నభవిష్యత్తులా బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- నిర్భంధాలను దాటుకొని ఉప్పెనలా ప్రజలు తరలివచ్చి సభను దిగ్విజయం చేస్తరు.
- పదేళ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగమైతే..16 నెలల రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టింది.
- హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పాలన మాకోద్దు.. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.
- రంగారెడ్డి జిల్లా నుంచి లక్ష మంది తరలింపుకు ఏర్పాట్లు.
- వరంగల్ రజతోత్సవ సభ విజయవంతంపై రంగారెడ్డి జిల్లా నాయకులతో సన్నాహాక సమావేశంలో మాజీ మంత్రి.
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా బ్రహ్మండమైన రీతిలో విజయవంతం అవుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.ఈనెల 27న వరంగల్ రజతోత్సవ సభ విజయవంతంపై శంషాబాద్లోని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులతో సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్ బి నగర్ ఎమ్మెల్యే డి.సుధీర్రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పీ కార్తీక్రెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, వివిధ నియోజకవర్గాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..తెంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ ఎస్ 24 ఏళ్లు పూర్తిచేసుకొని 25 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వరంగల్ ఈనెల 27న రజతోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు.14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని చివరకు పదవులను, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని అంతే ప్రాణపధంగా పదేళ్ల అద్భుత పాలనతో స్వరాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టారన్నారు.పోరాడి సాధించున్న స్వరాష్ట్రాన్ని కన్నబిడ్డలా సాకి కేసీఆర్ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపితే కాంగ్రెస్ రేవంత్రెడ్డి పాలనలో 16 నెలల్లోనే బ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి స్వర్ణయుగంగా ఉంటే, మాయ మాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటు పడితే, సంక్షేమం అటకెక్కిందని ఎద్దేవా చేశారు. మార్పు తీసుకువస్తామని అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజాపాలన పేరుతో దౌర్జన్యాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా కేసీఆర్ ప్రభుత్వ పథకాలను రద్దు లేదా పేర్లు మార్పును గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పాలన మాకొద్దని కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తేనే మాకు శ్రీరామరక్ష అని భావిస్తున్నారని సబితారెడ్డి పేర్కొన్నారు.ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబీకుతూ బీఆర్ఎస్ పట్ల రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటాన్ని సహించలేక వరంగల్ సభను అడ్డకునే క్రమంలో రేవంత్రెడ్డి సర్కారు ర్యాలీలకు అనుమతులు ఇవ్వకుండా అక్కసును వెల్లగక్కుతుందని ఆరోపించారు.అయితే ప్రభుత్వ నిర్భంధాలను దాటుకొని బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా వరంగల్ సభకు ప్రజలు స్వచ్చంధంగా ఉప్పెనలా పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు.రంగారెడ్డి జిల్లా నుంచి లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టకున్నామని, ఈ మేరకు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ ఎస్ రతజోత్సవ సభను దిగ్విజయం చేయాలని సబితారెడ్డి పిలుపునిచ్చారు.వరంగల్ సభకు తరలివచ్చే పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడా బీఆర్ ఎస్ పార్టీ నాయకత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.సమావేశంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల పార్టీ మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
