ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల సీఎంను కలిశారు. సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుందని డా. వినోద్ అన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిల్ ఈరవత్రి ఈ సందర్బంగా అన్నారు.