పదవులే నిబంధనలను మార్చుతాయా?
ముద్ర ప్రతినిధి, నిర్మల్: వడ్డించేవాడు మనవాడైతే చాలు అన్న చందంగా ఉంది జిల్లా అధికారుల తీరు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో సోమవారం ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నాలుగు రోజుల క్రితం ఒక వివాహిత తో రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డ కలెక్టర్ సి సి రాకేష్ ను కాపాడే విషయంలో మాత్రం అధికార యంత్రాంగం పోటీ పడింది. గత వారం స్థానికంగా ఉన్న ఒక టౌన్ షిప్ లో కలెక్టర్ కార్యాలయంలో క్యాంప్ క్లర్క్ గా ఉన్న రాకేష్ మరో వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వారిని పట్టుకున్న వాళ్ళు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.ఇందుకు సంబంధించి విడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఐతే పోలీసులు మాత్రం సదరు అధికారిపై చర్యలకు బదులు రికార్డు చేసిన ఆధారాలను బలవంతంగా డిలీట్ చేయించారు.
ఇక ఈ కేసు విషయమై అధికారులంతా ఒక్కటయ్యారు. కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసు అధికారులను సంప్రదిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కాగా పత్రికల్లో వార్తలు ప్రచురితం కాగానే సదరు అధికారిని సి సి విధుల నుంచి తప్పించారు తప్ప చర్యలు తీసుకోలేదు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులపై మాత్రం కేవలం 24 గంటల్లో తీసుకున్నారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్న ప్రజానీకం తమవారికో నీతి, ఇతరులకొక నీతి అనుసరించటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
