కోరుట్ల, ముద్ర విలేకరి: ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ మానుక ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం జెండా ఎగరవేసి, కేక్ కట్ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని, కేవలం పార్టీ స్థాపించి 9 నెలల వ్యవధిలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన మహానుభావుడు అని, ఇటు సినిమా చలన చరిత్రలో ఎన్నో పాత్రలు పోషించి ముఖ్యంగా కృష్ణుడు, దుర్యోధనుడు, రాముడు, పాత్రలకు జీవం పోసిన వ్యక్తి అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనత వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఒక చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ కు కేంద్రం వెంటనే భారతరత్న బిరుదును ప్రకటించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కటకం మహదేవ్, బాలే మారుతి, ఏనుగందుల శ్రీనివాస్, పాతర్ల విజయకుమార్, చంద్రకళ, లీల, రాధ తదితరులు పాల్గొన్నారు.