- కేటీఆర్, హరీష్ రావుతో చర్చలు సఫలం
- తుది నిర్ణయం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దే
- బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్?
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పేరును బిఆర్ఎస్ అధిష్టానం ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. రెండు రోజులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు తో చర్చలు కొనసాగాయి. ఈరోజు మధ్యాహ్నం ప్రసన్న హరికృష్ణ ట్రాక్ రికార్డు తుది నివేదికను బిఆర్ఎస్ అధిష్టానానికి అందించారు. దీనిని పరిశీలించిన బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసన్న హరికృష్ణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని బిఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలపదని పొలిటికల్ సర్కిల్లో చర్చ జోరుగా నడిచింది. అయితే ప్రసన్న హరికృష్ణ రూపంలో సరైన అభ్యర్థి దొరకడంతో బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ పేర్లను ప్రముఖంగా పరిశీలించింది. చివరికి నరేందర్ రెడ్డి కి టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ కు కాంగ్రెస్ లో భంగపాటు తప్పలేదు. ప్రసన్న హరికృష్ణ బిఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపి సక్సెస్ కావడంతో అనూహ్యంగా హరికృష్ణ కు టికెట్ దక్కింది. గత నాలుగు నెలలుగా 42 నియోజకవర్గాలలో ప్రసన్న హరికృష్ణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల శ్రేయస్సు నా లక్ష్యం అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రచారం ప్రారంభించారు. బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తే బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా మాజీ మేయర్ రవీందర్ సింగ్
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బరిలో నిలవనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. బిఆర్ఎస్ అధిష్టానం తనకే ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తుందని, కేసీఆర్ ఆశీస్సులు పుష్కలంగా తనకే ఉన్నాయంటూ గత నాలుగు నెలలుగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పూర్వ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనూహ్యంగా ప్రసన్న హరికృష్ణ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని తెలవడంతో అధిష్టానం నిర్ణయం రవీందర్ సింగ్ కు షరాఘాతంగా మారనుంది. గత 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి కరీంనగర్ మేయర్ గా, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ గా సుదీర్ఘ సేవలు అందించారు. కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా అధిష్టానం రవీందర్ సింగ్ కు మొండి చెయ్యి చూపడం స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో బిఆర్ఎస్ అధిష్టానం పై రవీందర్ సింగ్ ఆగ్రహంగా ఉన్నారు. రెబల్ గా బరిలో నిలిచి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.