Take a fresh look at your lifestyle.

ప్రతీక్షా తొండ్వాల్కర్ జీవన ప్రస్థానం… నేటి యువతకు ఆదర్శం

 

సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక కంపెనీలో డెయిలీ లేబర్ గా తన జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఆ కంపెనీ కి యజమానిగా మారడం. మరికొన్ని సన్నివేశాల్లో ఒక పాట పూర్తయ్యలోపు హీరోయిన్ కలెక్టర్ గా మారిపోవడం. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో అరుదు. కృషి, పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యం కావు. ఇలాంటి కోవకే చెందిన ఒక మహిళ విజయ ప్రస్థానం నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆమె జీవన ప్రస్థానం ఒక పాఠంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె ప్రతీక్షా తొండ్వాల్కర్.

మనల్ని మనం అంచనా వేసుకునేటప్పుడు కరెక్టుగా వేసుకోవాలి. ఎక్కువగా అంచనా వేసుకుంటే… ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతింటాం. తక్కువగా అంచనా వేసుకుంటే.. చేరాల్సిన గమ్యాన్ని చేరుకోలేం. ప్రతీక్షా తొండ్వాల్కర్ తనను తాను సరిగ్గా అంచనా వేసుకుంది. ఎప్పుడో 37 ఏళ్ల కిందట స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచి దగ్గర చీపురుతో ఊడ్చేది ఆమె. అలాంటి ఆమె ఇప్పుడు ఎస్.బి.ఐ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయ్యింది. ఇది ఎలా సాధ్యమైంది? ఈ 37 ఏళ్లలో ఆమె ఎలా ఎదిగింది? అను విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆమె కఠిన శ్రమను మన జీవితాలకు కూడా అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1964లో వెనకబడిన దంపతులకు జన్మించిన ప్రతీక్ష సదాశివ కాడును 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కొనసాగించింది. ఆమె భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచిలో బుక్ బైండర్.ఏడాది తర్వాత ఇద్దరికీ కొడుకు పుట్టాడు.ఆ తర్వాత సొంతూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో సదాశివ చనిపోయాడు. దాంతో ప్రతీక్ష ఒంటరిదైంది. వయసు 20 ఏళ్లు. చేతిలో పిల్లాడు. భవిష్యత్తేంటో తెలియని పరిస్థితి ఎదురైంది.

భర్త పనిచేసిన బ్రాంచ్ కి వెళ్లిన ప్రతీక్ష… భర్తకు సంబంధించి ఇవ్వాల్సి ఉన్న డబ్బు తీసుకోవడానికి వచ్చినట్లు చెప్పింది. అదే సమయంలో తన ఆర్థిక పరిస్థితి బాలేదనీ.. ఏదైనా పని ఉంటే ఇవ్వమని కోరింది. అప్పటికి ఆమె చదువు పూర్తి కాకపోవడం వల్ల వారు ఆమెకు బ్యాంక్ దగ్గర ఊడ్చే పని మాత్రమే ఇవ్వగలిగారు. ఆలా ఆమె బ్యాంక్ దగ్గర ఊడ్వటం, బాత్‌రూమ్స్ క్లీన్ చెయ్యడం, ఫర్నిచర్ తుడవడం వంటి పనులు చేసేది. అందుకు ఆమెకు నెలకు రూ.60 నుంచి రూ.65 ఇచ్చేవారు.

బ్యాంకులో ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతో… ఆమె బ్యాంక్ పని అయిపోయాక.. ఇతరత్రా చిన్న చిన్న పనులు కూడా చేసుకునేది. తన జీవితం అంతే అని ఆమె రాజీ పడలేదు. బ్యాంకులో పనిచేసే ఇతర ఉద్యోగులు, వారి జీతభత్యాల గురించి ఆమెకు తెలిసినప్పుడల్లా… తాను కూడా ఎదగాలని భావించేది. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పినప్పుడు.. వారు ఆమెకు తరచూ బుక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పుస్తకాల్ని చదువుతూ.. మరోవైపు పిల్లాణ్ని చూసుకుంటూ.. టెన్త్ పాసైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయాలనుకున్న ఆమెకు.. అందుకు ఇంటర్ పూర్తై ఉండాలన్న విషయం తెలిసింది. కానీ ఇంటర్ చదివేంత డబ్బు లేదు. ఒక్కోసారి పిల్లాడు వినాయక్.. బిస్కెట్లు కావాలని అడిగితే… ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం ఆమె.. దిగాల్సిన బస్టాప్ కంటే ముందు స్టాప్ లోనే దిగిపోయి… నడుస్తూ వెళ్లి.. ఆ మిగిలిన డబ్బుతో పిల్లాడికి బిస్కెట్లు కొనేది. అలాంటి ఆర్థిక పరిస్థితి ఆమెకు ఉండేది.

ముంబైలోని విఖ్రోలీలో.. నైట్ కాలేజీలో చేరిన ప్రతీక్ష… మొత్తానికి ఇంటర్ పాసైంది. అలా 1995లో బ్యాంకు క్లర్కు పోస్ట్ సంపాదించింది. ఇందుకు తనకు అన్ని రకాలుగా సాయం చేసిన ప్రమోద్ తొండ్వాల్కర్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అలా రెండో పెళ్లి చేసుకుంది.

2004లో బ్యాంక్ ట్రైనీ ఆఫీసర్ అయిన ప్రతీక్ష తర్వాత 18 ఏళ్లలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగింది. తాజాగా 2025 జూన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయ్యింది. మరో రెండేళ్లలో ఆమె రిటైర్ అవుతుంది. ఇలా ఆమె 39 ఏళ్లపాటూ SBIలో రకరకాల జాబ్స్ చేసి అసిస్టెంట్ మేనేజరుగా ఎదగడం స్పూర్తిదాయకం.ఆమె జీవితం, పడిన కష్టం,చేసిన ఉద్యోగాలు, ఎక్కిన మెట్లు,సాధించిన ఘనత.. ఇవన్నీ యువతకు ప్రేరణ కలిగిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే కుంగిపోతున్న నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

* సుధాకర్.ఏ.వి
* రాష్ట్రఅసోసియేట్ అద్యక్షులు
* స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
* 9000674747

Leave A Reply

Your email address will not be published.