ముద్ర మల్కాజ్గిరి
యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని, డిజిటల్ విద్యా విప్లవంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.
విద్యా నిపుణులు, సాంకేతిక నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్లో స్మార్ట్ నోట్స్, సమాధానాల మూల్యాంకనం, అనుకూల ప్రశ్నా బ్యాంకులు, తక్షణ పనితీరు విశ్లేషణ, మెంటార్ సహాయం వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.
ప్రెప్మంకీ వ్యవస్థాపక బృందంలో తలశిల రంజిత్, సుధాకర్, రామ్ అభినవ్ తేజ్, పావని, ఆకాశ్, మేఘనా రెడ్డి ఉన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ నేపథ్యాల నుంచి వచ్చే అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సరైన దిశానిర్దేశంతో విజయాన్ని అందించడం తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.