Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం

  • డిపోల కార్యకాలపాలన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే
  • స్పష్టం చేసిన టీజీఎస్‌ఆర్టీసీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని  పేర్కొన్నది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్‌ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ర్పచారం అంతా ఒక ఫార్స్ అని  పేర్కొన్నది. ఎలక్ట్రిక్ బస్సుల  మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని వెల్లడించింది. 
కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొన్నది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్ తో సహా  వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ తిప్పుతోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ప్రవేశపెట్టడం జరిగిందని, పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోందని వెల్లడించింది. ఆ బస్సుల మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా  టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోందని పేర్కొన్నది.
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం ఇవ్వడం జరిగిందని తెలియజేసింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ప్రైవేట్ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్ట్రిక్ బస్సులు రావడంలో ఆలస్యం జరుగుతోందని. మిగిలిన బస్సులు ఈ ఏడాది మే వరకు సంస్థకు అందజేస్తామని తెలిపింది.ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తోందని, ఎలక్ట్రిక్‌ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని అని వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతోందని వెల్లడించింది.
ప్రతి డిపో పరిధిలో రూరల్‌, అర్బన్‌ తదితర భిన్నమైన రూట్లు ఉంటాయని, ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్‌ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుందని….ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్‌, డీజిల్‌ మిశ్రమం ఉంటుందని తెలిపింది. ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయని… ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోందనిపేర్కొన్నది. ఒప్పందం ప్రకారం తిరిగిన కిలోమీటర్ల లెక్కన కంపెనీలకు నగదును చెల్లిస్తుందని స్పష్టం చేసింది.
సంస్థలో కొత్త బస్సుల కొనుగోలు జరగడం లేదనడంలో వాస్తవం లేదని తెలిపింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2500 కొత్త బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించింది. ఆర్టీసీలో  ఖాళీగా ఉన్న 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని… అందులో అధికంగా 2 వేల డ్రైవర్ పోస్టులున్నాయని తెలిపింది. పోలీస్ నియామక మండలి, టీజీపీఎస్సీ, తదితర సంస్థల ద్వారా వాటి నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని…. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి  సమర్పించవలిసి ఉందని పేర్కొన్నది.

Leave A Reply

Your email address will not be published.