- హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా కలిసి పని చేస్తాం
- మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా
- ఫ్లై ఓవర్కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు
- ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో రేవంత్రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నగర అభివృద్ధి విషయంలో ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్న సీఎం అభివృద్ధి విషయంలో కేంద్రాన్ని వదిలిపెట్టమన్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ను సోమవారం ప్రారంభించిన సీఎం.. దానికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోదీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతా..అసదుద్దీన్తో కలవాల్సి వస్తే కలుస్తామని తెలిపారు.ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ తనకు చిన్నప్పటి స్నేహితుడన్న సీఎం..హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తాయని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ ఏర్పడితే మరింత నగరం అభివృద్ధి చెందుతుందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్కు కలిపి రీజినల్ రింగ్ రైల్ కూడా కావాలని ప్రధాని కోరినట్లు వివరించారు. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించారని..ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ఏర్పడ్డాక రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించుకున్నట్లు వెల్లడించారు.మనకు మనమే సాటి అని చెప్పుకోవడానికి ఇదొక్కటి చాలు అనితెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దే ప్రజా ప్రభుత్వ ధ్యేయమనీ మెట్రో రైలు,రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్నామన్నారు. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు సీవరేజ్ పనులు ప్రారంభించినట్లు తెలీపారు. మూసీ నదిని పునరుజీవింపజేయాల్సిన అవసరం ఉందనీ హైదరాబాద్కు గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.నిజాం కాలంలో కాలంలో నిర్మించిన ఉస్మాన్, హిమాయత్ సాగర్లను నిర్మించి తాగునీటి సమస్యలు లేకుండా చేశారని సీఎం వెల్లడించారు. గతంలో హైదరాబాద్ లేక్ సిటీగా ఉండేదనీ నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలో హైదరాబాద్ అద్భుత నగరంగా ఉండేదన్నారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు చిన్న వర్షం వచ్చినా వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.