- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తి అయితే చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్టవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారుకలకు ఆయన దిశానిర్దేశం చేశారు.సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎఫ్టీఎల్ నిర్ధారిస్తున్న వేళ ప్రజల అభ్యంతరాలను కూడా స్వీకరించాలన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు ఉద్దేశించి రూపొందిస్తున్న లేక్ ఎన్యూమరేషన్ యాప్ లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలమ్ను పెట్టాలన్నారు. ఈ మేరకు సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఇదే అంశంపై ఎక్కువ మొత్తంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏవీ రంగనాథ్గారు ఎఫ్టీఎల్ నిర్ధారణ ప్రాధాన్యతను వివరించారు. చెరువుల్లో ఓ వైపు నుంచి మట్టిని నింపడంతోపాటు మురుగు నీరు నిరంతరంగా వచ్చి చేరడంతో ఎఫ్టీఎల్ పరిధులు మారిపోతున్న నేపథ్యంలో ఎఫ్టీఎల్ నిర్ధారణ వేగంగా జరగాల్సి ఉందన్నారు.గ్రామ, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతోందన్నారు. ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని కూడా వేసి, ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఫిర్యాదుదారులకు ఆయన వివరించారు.