- తెలంగాణలోనే ఉంచండి.
- సీనియర్ ఐఏఎస్ రోనాల్డ్ రోస్కు క్యాట్ ఊరట.
- కీలక ఆదేశాలు జారీ.
- రాష్ట్ర పునర్విభజన సమయంలో ఏపీకి అలాట్ అయిన రోనాల్డ్.
- క్యాట్లో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేసిన మరో ఐఏఎస్ శివశంకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించబడిన సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్కు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఊరట ఇచ్చింది.ఆయన్ను తెలంగాణలోనే కొనసాగేలా అవకాశం కల్పిస్తూ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రోనాల్డ్ రోస్ను ఏపికి కేటాయించింది.ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఏపీలో రిపోర్ట్ చేసినా,తర్వాత కొన్ని కారణాలతో మళ్లీ తెలంగాణకు వచ్చారు. తిరిగి ఇటీవల తన బదిలీపై రోనాల్డ్ క్యాట్ను ఆశ్రయించారు.తనకు తెలంగాణలో సేవల కొనసాగింపునకు అవకాశం కల్పించాలని, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించాలని కోరుతూ రెండోసారి క్యాట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారించిన ట్రైబ్యునల్ తాజాగా రోనాల్డ్ రోస్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నిబంధనలను పరిశీలించిన తర్వాతే..రోనాల్డ్ రోస్కు తెలంగాణలో కొనసాగేందుకు అనుమతినిచ్చేలా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.దీని ద్వారా రోనాల్డ్ రోస్కు సర్వీసులో కొనసాగే మార్గం సులభమైంది.ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదీలావుంటే మరో ఐఏఎస్ శివశంకర్ సైతం క్యాట్లో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు.క్యాట్ ఆదేశాలను డీవోపీటీ అమలు చేయడం లేదని పిటిషన్ వేశారు.శివశంకర్ను ఏపీకి కేటాయించాలని ఫిబ్రవరి 28న క్యాట్..డీవోపీటీని ఆదేశించింది.నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలంది. డీవోపీటీ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో శివశంకర్ మరోసారి క్యాట్ను ఆశ్రయించారు.ఉత్తర్వులు అమలు చేయడానికి డీవోపీటీ గడువు కోరింది.నాలుగు వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని డీవోపీటీని మరోసారి క్యాట్ ఆదేశించింది.