Take a fresh look at your lifestyle.

శ్రీ స్వర్ణ గిరీష్యుడికి ఘనంగా తిరుప్పావడ సేవ..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి
ఆలయంలో తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో ఆలయంలో నిత్య కైంకర్యాలు జరిగాయి.
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం. స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని,లడ్డు,వడ,తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేశారు.
సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.