ముద్ర, తాండూర్:
తాండూర్ మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు, ఇంటి యజమానులు అందరూ సకాలంలో పన్నులు చెల్లిస్తేనే తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చాలావరకు ఆస్తి పన్నులు బకాయిలు ఉన్నాయని ఈ ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మాత్రమే పన్నులు వసూలు చేయడం జరిగిందన్నారు. పన్నులు బకాయిలు ఉన్న ఇంటి యజమానులకు, వ్యాపారస్తులకు రెడ్ నోటీసులు అందజేయడం జరిగిందని, నోటీసులకు స్పందించకుంటే వారి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆస్తి పన్నుల వసూలు కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు కూడా వార్డు వార్డుకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారని, పనులు ఎప్పుడు చేస్తున్నారని ముఖ్యంగా తాండూర్ పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.