- పార్టీ ఫిరాయింపులపై అంశంలో సుప్రీం వ్యాఖ్యలు
- ఇంకా ఎంత సమయం కావాలంటూ అసహనం
- స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
- బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ
ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. తగిన సమయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది.. అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. దీంతో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ అసహనం ప్రదర్శించింది. అయితే ఎంత కాలం పడుతుందా అన్నదాదనిపై తాను స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తాననని ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు.
రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన బీఆర్ఎస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మందిపై అనర్హతా వేటు వేయాలని రెండు వేర్వేరు పిటిషన్లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసారు. పోచారం, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ మేరకు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేమని, ఎటువంటి గడువు విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు అసహనం
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్, ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్గి ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అంటూ స్పీకర్పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు తీరేవరకా అంటూ మండిపడింది. దీంతో స్పీకర్ నిర్ణయం తర్వాత డెసిషన్ చెప్తామని ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ను కనుక్కొని కోర్టుకు చెప్పండని రోహత్కికి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ వారం రోజులు పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణలో స్పీకర్ ఏం చెబుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.